- ఆవిష్కరణలే భవిష్యత్ వృద్ధికి పునాది
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క”
ఆర్గాన్ హైదరాబాద్:
గ్లోబల్ సమ్మిట్లో భాగంగా నిర్వహించిన ‘క్యాపిటల్ మరియు ప్రొడక్టివిటీ ఫర్ 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ’ చర్చా గోష్టికి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రాబోయే 22 ఏళ్లలో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆయన స్పష్టం చేశారు.
ఆ లక్ష్యాన్ని సాధించాలంటే పెట్టుబడులకు ఆవిష్కరణలు జోడించాల్సిన అవసరం ఉందని, “మూలధనం + ఆవిష్కరణ = ఉత్పాదకత” అనే సమీకరణమే భవిష్యత్ వృద్ధికి అసలు బలం అని వివరించారు.
ఉత్పాదకత పెరిగితేనే పౌరుల ఆదాయం, సామాజిక గౌరవం పెరుగుతాయని పేర్కొన్నారు.
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తర్వాతి దశలో తెలంగాణ ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు అడుగులు వేస్తుందని తెలిపారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులేటర్గా కాకుండా, ఇన్నోవేషన్కు క్యాటలిస్ట్గా, భాగస్వామిగా వ్యవహరించే విధానాన్ని అవలంబిస్తుందని చెప్పారు.
తెలంగాణ ‘రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్లో భాగంగా క్యూర్ (అర్బన్), ప్యూర్ (పెరి-అర్బన్), రేర్ (రూరల్) నమూనాలతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
డీప్టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు గ్రామీణ రైతుల ఉత్పాదకత పెంపుకు కూడా ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.


