Home POLITICS కొత్తగూడెం రైల్వే స్టేషన్ రహదారికి భూ మార్పిడిని వేగవంతం చేయండి

కొత్తగూడెం రైల్వే స్టేషన్ రహదారికి భూ మార్పిడిని వేగవంతం చేయండి

21
0
  • రైల్వే చైర్మన్ కు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ ఆర్గాన్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదుట ప్రధాన రహదారి విస్తరణ ఎంతో కాలంగా పెండింగ్ లో ఉందని, ఇక్కడ వాహనదారులు, ప్రజలు నిత్యం ఇబ్బంది ఎదుర్కొంటున్న రీత్యా రహదారి విస్తరణకు కీలకమైన భూ మార్పిడి ప్రక్రియను వేగవంతం చేసి తక్షణం ఆమోదించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే చైర్మన్ సతీష్ కుమార్‌ను కోరారు. బుధవారం రాత్రి ఢిల్లీలో ఆయనను కలిసి పలు విషయాలు చర్చించారు.
కొత్తగూడెం (బీడీసీఆర్) స్టేషన్ వద్ద 4,556 చ.మీ. (5,449 చదరపు గజాలు) రైల్వే భూమి రహదారి విస్తరణకు అవసరమని, దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. ఇది స్థానిక ప్రజల దీర్ఘకాల డిమాండ్ అని పేర్కొన్నారు.

ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద..

సమాన విలువ (EVL) పద్ధతిలో ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద 3,969.5 చ.మీ. రాష్ట్ర ప్రభుత్వ భూమిని రైల్వేకు ఇచ్చి, దానికి ప్రతిగా కొత్తగూడెం వద్ద రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ప్రతిపాదన ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇవ్వగా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు సంయుక్త సర్వే పూర్తి చేసి అంగీకారం తెలిపినట్లు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 2025 నవంబర్ 14న బోర్డుకు ప్రతిపాదన పంపినప్పటికీ ఇంకా ఆమోదం లభించలేదని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసే ఈ అంశంపై ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.