- ఆన్లైన్ డిస్కౌంట్లపై ఫార్మసిస్టుల ఆగ్రహం
- మీర్పేట్ నుంచి బాలాపూర్ వరకు స్వచ్ఛందంగా మూతపడిన మెడికల్ దుకాణాలు
రంగారెడ్డి, మే 20 (ఆర్గాన్ న్యూస్):
ఆన్లైన్ ఔషధ విక్రయాలు, కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఇచ్చిన బంద్ పిలుపు మహేశ్వరం నియోజకవర్గంలో విజయవంతమైంది. మీర్పేట్, అల్మాస్గూడ, బడంగ్పేట్, బాలాపూర్ ప్రాంతాల్లో మెడికల్ దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
ఈ సందర్భంగా శ్రీ వినాయక జనరిక్ మెడికల్ షాప్ యజమాని, ఫార్మసిస్ట్ బిట్టి రాజు మాట్లాడుతూ, అఖిల భారత కెమిస్ట్ సమాఖ్య పిలుపు మేరకు దుకాణాలు మూసివేసినట్లు తెలిపారు. ఆన్లైన్లో మందుల కొనుగోళ్లు పెరగడం వల్ల స్థానిక మెడికల్ షాపులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, చిన్న వ్యాపారులు నష్టాల్లోకి వెళ్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నాణ్యతలేని మందుల తయారీ మరియు విక్రయాలను కట్టడి చేయాలని ఫార్మసిస్టులు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అత్యవసర సేవలను మినహాయించి మెడికల్ షాపులు పూర్తిగా బంద్లో పాల్గొనడం గమనార్హం. ఈ బంద్కు స్థానిక ఫార్మసిస్టులు, మెడికల్ షాప్ యజమానులు భారీగా మద్దతు తెలిపారు.









