- మహేశ్వరం పోక్సో కేసులో ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు
- బాధిత బాలికకు రూ.1 లక్ష పరిహారం మంజూరు
రంగారెడ్డి, మే 20 (ఆర్గాన్ న్యూస్):
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో 2021లో నమోదైన కీలక పోక్సో కేసులో ఎల్బీనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై నేరం రుజువుకావడంతో కోర్టు కఠిన శిక్ష విధించింది.
ఎల్బీనగర్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం.కే. పద్మావతి నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.13 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా బాధిత బాలికకు రూ.1 లక్ష పరిహారం (విక్టిమ్ కాంపెన్సేషన్) మంజూరు చేయాలని ఆదేశించారు.
దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికలపై జరిగే లైంగిక నేరాల విషయంలో చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు సమాజానికి బలమైన హెచ్చరికగా నిలుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.









