- అర్జీల త్వరిత పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
- భూ వివాదాల కోసం ఎస్డిసి కోర్టు ఏర్పాటు
ములుగు, మార్చి 23 (ఆర్గాన్ న్యూస్):
ఏటూరునాగారం ఐటిడీఏలో నిర్వహించిన గిరివాణి–ప్రజావాణి కార్యక్రమానికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. గిరివాణికి 130, ప్రజావాణికి 52 అర్జీలు అందగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఐటిడీఏ ఇంచార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో కలెక్టర్ స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రోడ్ల నిర్మాణం, బోర్వెల్స్ ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనపై గిరిజనులు తమ సమస్యలను వివరించారు.
భూ వివాదాలు, ఎల్టీఆర్ కేసులపై అధికంగా ఫిర్యాదులు రావడంతో వాటి పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎస్డిసి కోర్టును వారానికి నాలుగు రోజులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉపాధి హామీ పథకం సహా ఇతర నిధులతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.


