- తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఎక్కడ?
- ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగంధర్ విమర్శలు కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 9:
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ప్రధానికి బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగంధర్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం “2 కోట్ల ఉద్యోగాలు” కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులు, కాంట్రాక్టు ఉద్యోగాల పెరుగుదల దీనికి నిదర్శనమని అన్నారు.
అదే విధంగా తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదని, ఐటీఐఆర్, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం వంటి సంస్థల పూర్తి స్థాయి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని, తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు.
తెలంగాణ ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకుని రాజకీయ లాభాలు పొందడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని యుగంధర్ ఆరోపించారు.
భారత రైల్వేలో “మాన్ పవర్ రేషియోనాలిసాషన్ 2026–27” పేరుతో 29,608 పోస్టులను తగ్గించే నిర్ణయం తీసుకోవడం దారుణమని, దీనిని ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
దేశ యువత భవిష్యత్తుతో, తెలంగాణ ప్రజల ఆశయాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడితే ఏఐవైఎఫ్ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక, యువత వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు, నిరసనలు, ముట్టడులు మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా నాయకులు శ్రీకాంత్, రవి నాయక్, అరవింద్, మురళి, అజయ్, ప్రశాంత్, కిరణ్ నాయక్, రవీందర్ నాయక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.





